తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై అవగాహన లేకుండా పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ ఉద్యమకారుడు బాలాజీ సింగ్ ఠాకూర్ తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై అవగాహన లేకుండా పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ ఉద్యమకారుడు బాలాజీ సింగ్ ఠాకూర్ తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదని, అది దశాబ్దాల పాటు సాగిన ప్రజా ఉద్యమానికి ప్రతిఫలమని బాలాజీ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, సాధారణ ప్రజలు తమ జీవితాలను పణంగా పెట్టి సాధించిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుచేశారు. ఉద్యమం మొత్తం శాంతియుతంగా, ప్రజాస్వామ్యపరంగా సాగిందని, ఎక్కడా హింసకు తావులేకుండా తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలను ప్రపంచానికి చాటారని వివరించారు.

ఉద్యమానికి నాయకత్వం వహించిన కే. చంద్రశేఖర్ రావు పాత్రను ప్రస్తావిస్తూ, ఆయన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పొందిందన్నారు. రాష్ట్ర విభజనను హింసతో పోల్చడం అసంబద్ధమని, ఆంధ్ర–తెలంగాణలు అన్నదమ్ముల్లా పరస్పర గౌరవంతో విడిపోయాయని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాత్రను గుర్తు చేస్తూ, రాజకీయ నష్టాన్ని తెలిసినా రాష్ట్ర ఆవిర్భావానికి మార్గం సుగమం చేసిందని తెలిపారు. అదే సమయంలో ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సుష్మ స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ వంటి జాతీయ నాయకుల సహకారం తెలంగాణ సాధనలో కీలకమైందని పేర్కొన్నారు.
“తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమైనట్లే, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా రాష్ట్ర విభజన కూడా అవసరమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వంటి అత్యున్నత వేదికలో మాట్లాడే ప్రతి మాట దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని గుర్తుచేస్తూ, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

