దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. కాగా, లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా(Odisha) ఫలితాలు షరామామూలుగానే జూన్ 4న వెలువడతాయి.
అరుణాచల్లో ప్రధాన పార్టీలు
అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ మొత్తం 60 సీట్లలోనూ పోటీ చేయగా, కాంగ్రెస్ 19 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు రాష్ట్రంలో మరో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే పోటీ లేకుండా 10 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి (2024) అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.95 శాతం పోలింగ్ జరిగింది. 2019లో 82.17 శాతం పోలింగ్ జరిగింది.
సిక్కింలో ప్రధాన పార్టీలు
సిక్కింలో ప్రధాన పోటీ అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం), సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) మధ్య ఉంది. బీజేపీ, కాంగ్రెస్లు మరో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి (2024) 79.88 శాతం పోలింగ్ జరుగగా, 2019లో 81.43 శాతం పోలింగ్ రికార్డయింది.
అరుణాచల్, సిక్కింలో 2019 ఫలితాలివే…
2019లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుని, పెమా ఖండూ తిరిగి సీఎం అయ్యారు. కాంగ్రెస్ 4 సీట్లు, జేడీయూ 7, ఎన్పీపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. సిక్కింలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం 17 సీట్లతో మెజారిటీ సాధించగా, ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్డీఎఫ్ 15 సీట్లకు పరిమితమైంది.