కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్వంత బిడ్డలనే బావిలో ముంచి చంపిన కన్నతండ్రితో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.
జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలం (28) 2020లో మౌనికతో వివాహం చేసుకున్నాడు. 2022లో వీరికి కవల ఆడపిల్లలు జన్మించారు. మగపిల్లవాడు కావాలని ఆశించిన శ్రీశైలం, ఆడపిల్లలు పుట్టడంతో అసహనం వ్యక్తం చేస్తూ, ఆస్తి మక్కువతో తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్తో కలిసి దారుణానికి పథకం వేశాడు. ఏప్రిల్ 3న ఇద్దరు చిన్నారులను పొలం వద్దకు తీసుకెళ్లి బావిలో తోసి, స్వయంగా నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అనుమానం రాకుండా కేకలు వేస్తూ నటించాడు.
గ్రామస్తుల అనుమానం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు జరిపి, గోపాల్పూర్లో తలదాచుకున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించారు. అరెస్టైన వారు: శ్రీశైలం (తండ్రి), అశోక్ (తాత), లావణ్య (నానమ్మ), రాకేష్ (బాబాయ్). హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సి.ఐ. నిరంజన్ రెడ్డి, సిబ్బందిని కరీంనగర్ సి.పి. గౌష్ఆలం అభినందించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసి, నిందితులను రిమాండ్కు తరలించారు.

