మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ: వాతావరణ మార్పులపై పోరాటానికి, భవిష్యత్ తరాల పరిరక్షణకు మొక్కలు నాటడమే శరణ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా భారతీయ పౌరులందరూ తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు(గురువారం) న్యూఢిల్లీ జంతర్ మంతర్లోని తన అధికారిక నివాసంలో బండి సంజయ్ మొక్కలు నాటారు. తన కార్యాలయ సిబ్బందితో కూడా మొక్కలు నాటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మొక్కల పెంపకం ద్వారా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు బండి సంజయ్ కుమార్.
వాతావరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ కుమార్ అన్నారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగితోపాటు ప్రతీ భారతీయ పౌరుడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తల్లుల అనురాగానికి, పోషణకు గుర్తుగా మొక్కలు నాటడం ఒక అర్థవంతమైన నివాళి అవుతుందని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.