రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పులిగోనిపల్లి తాండలో మద్యం మత్తులో భర్త కుటుంబంపై దాడి చేసి భార్య, కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పులిగోనిపల్లి తాండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కవితతో కలిసి నలుగురు సంతానంతో జీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే రాందాస్ నాయక్ మద్యానికి బానిసై పెళ్లి అయినప్పటి నుంచి తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ కుటుంబ కలహాలు చివరకు విషాదానికి దారితీశాయి.

మద్యం మత్తులో అదుపు కోల్పోయిన రాందాస్ నాయక్, భార్య కవిత (28) తో పాటు తన కుమారుడు హర్షిత్ (6) గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు ప్రణీత (8) తీవ్రంగా గాయపడగా, ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు కుమార్తెలు సంఘటన సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏసీపీ జానకిరామ్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. మద్యానికి బానిసై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఆయన తెలిపారు.

ఈ ఘటనతో పులిగోనిపల్లి తాండలో విషాద వాతావరణం నెలకొంది. ఒకే కుటుంబంలో జరిగిన ఈ దారుణ హత్యాకాండ స్థానికులను కలచివేసింది.

