ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీగా మంటలు చెలరేగి స్థానికంగా కలకలం రేపాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో శుక్రవారం భారీగా మంటలు చెలరేగి స్థానికంగా కలకలం రేపాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీ సిబ్బంది చెత్తకు నిప్పంటించడం వల్లే మంటలు వ్యాపించాయని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. యార్డులో తరచూ చెత్త దహనం జరుగుతుండటంతో పర్యావరణానికి హాని కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్డు కౌన్సిలర్ పుల్లారెడ్డి అనూష శ్రీశైలం ఘటనపై వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో డంపింగ్ యార్డులో చెత్తను బహిరంగంగా దహనం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

