21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ

ప్రధాని
Spread the love

మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమర్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టంతో (నారీ శక్తి వందన్ అధినియం) ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సముచిత స్థానం కల్పించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు. ఢిల్లీలో సోమవారంనాడు నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

పాలనలో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలతో తెరపడనుందని మోదీ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు అంకితమని అన్నారు. 21వ శతాబ్దం మహిళలదేనని, మహిళా రిజర్వేషన్ చట్టం అమలుతో చిరకాల స్వప్నాల సాకారంతో పాటు భవిష్యత్ సంకల్పాలు నెరవేరుతాయని అన్నారు. సామాజిక న్యాయం కేవలం పురుషుల వల్ల మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో లింగ సమానత్వం, సామాజిక న్యాయం సాకారమవుతుందని పేర్కొన్నారు.

‘మహిళా సాధికారతా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 నుంచి అమలు చేయాలనే ఏకగ్రీవ డిమాండ్ ఉంది. 2029 గడువును దృష్టిలో ఉంచుని దీనిపై సమగ్ర చర్చను ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో చేపట్టనున్నాం’ అని మోదీ తెలిపారు. పరస్పర సహకారం, పార్టిసిపేషన్‌తో ఈ పని నిర్వహించాలని తమ అభిమతమని, ఈసారి కూడా ప్రతి ఒక్కరి సమష్టి కృషితో సభాగౌరవం సమున్నత శిఖరాలకు చేరుకోబోతుందని అన్నారు.

ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడు రోజుల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడిన సవరణలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. 20029 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను కచ్చితంగా మహిళా రిజర్వేషన్లతో నిర్వహించుకుందామని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి సవరణ బిల్లులను ఆమోదించాలని వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభాపక్ష నాయకులకు మోదీ లేఖ రాశారు. దేశ మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఎంపీలంతా ఏకమై మాడ్లాడాలని, చరిత్రాత్మక మార్పునకు నాందీ పలకాలని ఆ లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top