Site icon Chaithanya Galam News

పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం 

దోపిడీ

దోపిడీ

Spread the love

కరీనంగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ బంగారు షాపులోకి దూరిన కేటుగాళ్లు తుపాకులతో నిర్వాహకులపై కాల్పులు జరిపి అందినకాడికి దోచుకెళ్లారు. 

కరీంనగర్, మే 3 : కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌ లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన ఈ కాల్పుల ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

సినీ ఫక్కీలో దోపిడీ

కరీంనగర్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. కస్టమర్ల ముసుగులో వచ్చిన వీరు, లోపలికి రాగానే ఆయుధాలు తీసి సిబ్బందిని బెదిరించారు.

కాల్పుల కలకలం..

షాపు సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించగా, దొంగలు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల శబ్ధంతో షోరూమ్ లోపల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో ఐదుగురు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. భద్రతా సిబ్బందిని, సేల్స్ మెన్‌లను భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరినీ కరీంనగర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా.. మరో వ్యక్తి మధుకర్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

పోలీసుల చర్యలు..

కాల్పుల ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు షోరూమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. జ్యోతి నగర్ గల్లీ నుంచి పారిపోయే క్రమంలో దొంగలు బైకుపై నుంచి కిందపడ్డారు. కంగారులో రెండు బులెట్స్, ఒక మ్యాగజైన్‌ను అక్కడే వదిలేశారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇది దర్యాప్తులో అత్యంత కీలక ఆధారంగా మారనుంది. దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారు, ఏ వాహనంపై వచ్చారనే విషయాన్ని తెలుసుకోవడానికి నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

నగరంలో హై అలర్ట్

ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. పట్టపగలే, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం సంచలనంగా మారింది. దోపిడీ దొంగలు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారా లేక స్థానికులా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version