సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఆర్థిక లావాదేవీలకు వేదికగా మారుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ను కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 పేరుతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, అందులో 13 మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
కరీంనగర్: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఆర్థిక లావాదేవీలకు వేదికగా మారుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ను కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 పేరుతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, అందులో 13 మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ముఠా ద్వారా సుమారు ₹138 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
కేసులు – నమోదు చేసిన సెక్షన్లు
ఈ కేసులకు సంబంధించి వివిధ క్రైమ్ నంబర్లతో కేసులు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 112, 318(4) మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 66-D కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రత్నాకర్ బ్యాంక్ (RBL బ్యాంక్) మరియు వర్చువల్ ఖాతాల ద్వారా జరిగిన మోసాలపై ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోసం పద్ధతి (Modus Operandi)
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అత్యంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
• సమన్వయకర్తలు: మ్యూల్ ఖాతాల ఏర్పాటును పర్యవేక్షించడం
• మధ్యవర్తులు: సామాన్య ప్రజలకు కమిషన్ ఆశ చూపి వారి పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరవించడం
• ఖాతాదారులు: తమ బ్యాంక్ ఖాతాలు, ATM కార్డులు, లాగిన్ వివరాలు నేరగాళ్లకు అప్పగించడం
• ఈ ఖాతాల ద్వారానే సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును విదేశాలకు మళ్లించడం
ప్రధాన నిందితులు – వారి పాత్రలు
అరెస్ట్ చేసిన నిందితులలో
బండారి సాయిరాం (30) – వెల్గటూర్, జగిత్యాల
అనుమాండ్ల రంజిత్ (36) – గోపులాపూర్, బుగ్గారం, జగిత్యాల
అలిగేటి మల్లేశం (37) – ధర్మారం, పెద్దపల్లి
బోగ రాకేష్ (35) – జగిత్యాల
బండి ప్రణయ్ (25) – వెదిరె, రామడుగు, కరీంనగర్
భువనగిరి కళ్యాణ్ (52) – హన్మకొండ (బ్యాంక్ అధికారి)
ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్ అయేషా బేగం (30) – కరీంనగర్
విభూది రాంకుమార్ (37) – ధర్మారం, పెద్దపల్లి
నతర్ల శ్రీనివాస్ (39) – లక్ష్మిపూర్, జగిత్యాల
కర్రే రాజు (35) – వరంగల్
కల్లెడ మహేందర్ (36) – జగిత్యాల
కొండ్ర నరహరి (37) – జగిత్యాల
కల్లెడ రాజేష్ (27) – జగిత్యాల
తదితరులు ఉన్నారు.
ఆర్థిక లావాదేవీల వివరాలు
పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడిన లావాదేవీలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
• వర్చువల్ ఖాతాల ద్వారా – ₹12,25,31,665
• RBL బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా – ₹125,80,71,688
• మొత్తం లావాదేవీలు – సుమారు ₹138 కోట్లు
ప్రజలకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
కొద్దిపాటి కమిషన్ ఆశతో మీ బ్యాంక్ ఖాతాలు, ATM కార్డులు, OTPలు, లాగిన్ వివరాలు ఇతరులకు ఇవ్వవద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలియని వ్యక్తుల కోసం బ్యాంక్ ఖాతాలు తెరిస్తే లేదా ఖాతాలు వినియోగించేందుకు ఇస్తే, మీరు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని హెచ్చరించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కేసులో తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

