మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈసారి కరీంనగర్లో మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
కరీంనగర్: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈసారి కరీంనగర్లో మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ వేడుకలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహనీయుల జయంతి ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీవోలు, పోలీస్ అధికారులు, సోషల్ వెల్ఫేర్ అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహనీయుల విగ్రహాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏప్రిల్ 2న జరిగే గ్రామసభల్లో జయంతి ఉత్సవాల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాఠశాలల్లో మహనీయుల జీవిత చరిత్రపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు వారి జీవిత చరిత్రపై వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో మహనీయుల విగ్రహాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు.
జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి దళితుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తిమ్మాపూర్లో మహనీయుల విగ్రహాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దళిత సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని తమ సూచనలు వెల్లడించారు.

