Site icon Chaithanya Galam News

ప్రతి ప్రాణం విలువైనదే – డీజీపీ బి. శివధర్ రెడ్డి

శివధర్

శివధర్

Spread the love

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలే రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని, ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా ప్రారంభించామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలే రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని, ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 7500 మంది ప్రాణాలు కోల్పోయారని శివధర్ ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత కాదని, వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ భాగస్వాములే కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల మరణాలు అధికంగా ఉండటంతో నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, స్ట్రాప్ లేకపోతే ప్రమాద సమయంలో రక్షణ లభించదని హెచ్చరించారు. ఫోర్ వీలర్ ప్రయాణికులు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలన్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్, ఓవర్ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు దిక్కు కోల్పోతున్నాయని ఉదాహరణలతో వివరించారు. స్కూళ్లు, గ్రామాల వద్ద వేగం తగ్గించి, పాదాచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ స్కై బెలూన్, పోస్టర్, పాట సీడీ ఆవిష్కరించారు. హెల్మెట్లు పంపిణీ చేసి, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కరీంనగర్ పోలీసుల స్టాళ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రహవీర్, హిట్ అండ్ రన్ బాధితులకు ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఇప్పటివరకు 600 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, మూడు నెలల్లో 16% ప్రమాద మరణాలు తగ్గించామని వివరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎంవిఐ చక్రవర్తి, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version